My Blog List

My Blog List

Thursday, April 3, 2014

సాయిబాబా దివ్యవాణి :

బాబా ఒకసారి భక్తులతో ఇలా అన్నారు :
నేను మీకు దూరంగా ఉన్నాన దగ్గరగా ఉన్నాన అని మీరు ఆలోచించవలసిన పని లేదు. మీరెక్కడ నున్నప్పటికి, ఏమిచేసినప్పటికి నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను, ప్రపంచమందు చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సుత్రదారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియచాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. ఎవరైతే తమ ద్రుష్టి నావైపు త్రిప్పెదరో వారికి ఏ హానిగాని, బాధగాని కలుగదు. ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే.

బాబా తనభక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను :
నేననగా ఎవరు? అని సాయిబాబా ఎన్నో సార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు. నన్ను వెదకుటకు నీవు దూరముగాని, మరెచ్చటకుగాని వెళ్లనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలో, చైతన్యము లేదా అంతరాత్మ కలదని అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనే గాక అన్నింటిలోను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకాత్వమనుభవించి నాలో ఐక్యము పొందెదవు.

మానవుడు యత్నించవలసినది (శ్రీ సాయి సచ్చరిత్ర : ఎనిమిదవ అధ్యాయం)
మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్దగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకై త్వరపడవలెను. చదువు అయిపోయిన విద్యార్థి ఉద్యోగం కోసం ఏ విదంగా ఆతురతపడతాడో, యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్దకము, అలసటను, కునుకుపాట్లు దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయనిచో మనము పశుప్రాయులమగుదుము. 

ప్రార్ధన (శ్రీ సాయి సచ్చరిత్ర : 25 వ అధ్యాయము) :
ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములయందు, దుర్మార్గపు పనులందు మాకుగల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది.   

శ్రీసాయి యొక్క అనంత తత్త్వములో ముఖ్యమైనవి ౩ కలవు :
శ్రీసాయి ఇట్లనెను.
- ఊరకే గ్రంధములు చదువుట వలన ప్రయోజనము లేదు. చదివిన విషయములు విచారించి ఆచరణలో పెట్టవలెను.
- భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తులను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తులు మరేవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.
- ఎవరినీ నిందించకూడదు. తృణీకరించరాదు మరియు ఇతరుల విషయములో జోక్యము చేసుకోరాదు.



బాబా బోధనల సారాంశం :
హిందువుల దేవుడైన రాముడు, మహమ్మదీయుల దేవుడైన రహీమ్ ఇద్దరు ఒక్కరే. వారిద్దరికీ భేదం లేదు. అలాంటప్పుడు వారి భక్తులు అజ్ఞానంతో పోట్లాడుకుంటారెందుకు. అన్ని మతాలూ, జాతులు సోదరభావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి. వివాదములు, ఘర్షనలు, అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరితోనూ పోటీ పడవద్దు. మీ అభివృద్దిని మీరు చూసుకోండి. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి దారులు. వీటిలో ఎవరికీ వీలైన వాటిని వారు పాటించి మోక్షం పొందవచ్చును. ఎవరైనా నీకు అపకారం చేసిన తిరిగి వారికి నీవు అపకారం చేయవద్దు. వీలైనంత మంచిని ఇతరులకు చేస్తూనే ఉండాలి.
ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు, శరీరం నుంచి ప్రాణం బయటపడితే, దానికి ఏ విధమైన బంధాలతోను సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షువులకు అలాంటి స్థితిలో దేనిమీద ఆశలేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు మరణించగానే ప్రాపంచిక వ్యవహారాల ఆశ, పాశాలనుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించటం పునర్జన్మ. ప్రపంచం, శరీరం మీద కోరికలు ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమిమీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి.    

శిష్యులు ఎన్ని రకాలు అన్న విషయాన్ని బాబా స్వయంగా చెప్పాడు:
గురువుకు ఏమి కావాలో గుర్తించి వారు ఆదేశించక ముందుగానే దానిని నెరవేర్చు వారు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించగానే ఆలశింపక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు. మాటి మాటికి తప్పులు చేయుచు గురువు ఆజ్ఞాపించిన కూడ ఆ పని చేయవచ్చునా లేదా అని అనుమానిస్తూ, తరువాత చేద్దాములే అని వాయిద వేస్తూ ఉండే వారు సాధారనులు. 
సాబూరి అంటే ఓర్పుతో వేచి ఉండటం. ఇది కూడ భక్తునికి చాల అవసరం. శ్రద్దలేని పూజలు, ఓర్పులేని భక్తీ ఎందుకు
పనికిరావు. అలాంటి వాటివలన సాధకులు గాని భక్తులు గాని ఉపయోగాన్ని పొందలేరు.
మనోనిగ్రహము గురించి బాబా నానాకు బోధించుట:
ఒకనాడు బీజాపూరు నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్ధమై వచ్చెను. వారిలో ఇద్దరు ఘోషా స్త్రీలు కలరు. వారు మసీడులోనికి వచ్చి బాబా ఎదురుగా మోములపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి. వారిలో ఒకామె చక్కదనాల చుక్కవలె అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకోక్కసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వేల్లిపోయిన తరువాత బాబా నానాతో నిన్నేలకొట్టితిని అని ప్రశ్నిస్తాడు. నామనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును నీవు చూచిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంతా అందంగా ఉంటె, ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా!
మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతనుగాని ఇందులో గల వస్తువులను కాదు. గుడికి పోవునది దేవుని కొరకుగాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథంలాంటిది. బుద్ధి రథసారధి. ఇంద్రియాలు గుర్రాలు. గుర్రముల పగాలను రథసారధి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు. అట్లు గాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానము చేరలేము. బుద్దితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమె ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు.

బ్రహ్మజ్ఞానము గురించి బాబా బోధన :
ఓ మిత్రుడా బ్రహ్మజ్ఞానమనగా ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు. జీవుడే దేవుడు. ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే అయిదింటిని భగవంతునికి సమర్పించాలి. అవి   పంచప్రాణములు, 2. పంచేంద్రియములు, ౩. మనస్సు, 4. బుద్ధి, 5. అహంకారము. ఇవన్ని మనిషికి అంతర్గంగా ఉండేవి. బహిర్గతంగా ఉండే సంపదను పరిత్యజించటం చాల తేలిక. అంతర్గత ఈ అయిదు విషయాలను త్యజించటం చాల కఠినమైన విషయం. పదునైన కత్తిఅంచుపై నడవటంలాంటిది. బాహ్యవస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంలో ఉన్నట్లుగా అర్థం. అలాంటి వారికి అంతరంగికమైన ఈ అయిదు విషయాలు అర్ధమే కావు.
అంతేగాక ఆత్మజ్ఞాని కావాలనుకునే వాడు ముందు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి.
1.      మోక్షము లేక ప్రాపంచిక బంధాల నుంచి స్వేఛ్చ పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి.
2.      ఇహలోక విషయాలపైన, పరలోక ఆశలపైన కూడ విసుగు విరక్తి కలగాలి.
3.      మానవుని ఇంద్రియాలేప్పుడు శరీరానికి బయటగల విషయాలను చూచునట్లు అలవాటుపడినవి. వాటి దృష్టిని బయటి వస్తు సముదాయముల నుంచి వేరుచేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానముతో చూడగలగాలి.
4.      చెడు, దుర్మార్గపుదారుల నుండి బుద్దిని మర్పలేక, మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానము వలన కూడ ఆత్మ సాక్షాత్కారము పొందలేరు.
5.      సర్వకాల సర్వావస్థల యందు సత్యం పల్కుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు, బ్రహ్మచారిగా ఉండవలెను.
6.      తాత్కాలిక సంతోషం (ప్రాపంచిక విషయాలు) కన్నా శాశ్వతమైన మేకు కలిగించే ఆధ్యాత్మిక విషయాలనే కోరుకోవలెను.
7.      మనస్సును ఇంద్రియములను స్వాధీనమునందుంచుకొనవలెను.
8.      మనస్సును పవిత్ర పరచవలెను. మనిషి తానూ చేయవలసిన పనులను సక్రమంగా, త్రుప్తిగాను, ప్రతిఫలాపేక్షలేకుండాను నిర్వర్తించవలెను. అప్పుడు మనస్సు పవిత్రపడును. పవిత్రమైన మనస్సులో నుంచే వివేకము పుట్టి వైరాగ్యము అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానము కలుగును. లోభము, మోహము, ఆశాపాశములు తోలగనిదే జ్ఞానం లభించదు.
9.      ఈ స్థితిని ప్రతి సాధకుడు తనంతట తానుగా కష్టించి సాధించుకోనవలెను.      
10.  వేదపాండిత్యం వల్లగాని, ధనాదిక్యత, కులాధిక్యత వలన గాని, బలాధిక్యత వలనగాని, మేధాశక్తి వలనగాని, ఆత్మ జ్ఞానం కలుగదు.

బాబా తన భక్తులకు ఊదీ ప్రసాదము ఇచ్చుట ద్వార ఏమి బోధించదలచెనో తెలుసుకొనవలెను:
ఈ ప్రపంచము మనకు కనిపించు ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి మన శరీరం కూడ అంతే, శరీరంలో నుంచి ప్రాణం పోయిన తరువాత దానిని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. యిలాంటి ఆశాస్వితమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? ఆశాస్వితమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడ ఈ బూడిదవలె ఆశాస్వితమైనది అని తెలుసుకోమని హెచ్చరించటానికి బాబా భక్తులందరికీ ఈ విభూది ఇచ్చేవాడు.     

బాబా తన భక్తులు అల్పమైన కోరికలు కోరినప్పుడు ఇచ్చిన గొప్ప సమాధానం :
భక్తులు అనేక మంది బాబా దగ్గరకు వచ్చి కేవలం భౌతికమైన ధనం, అస్తిపాస్తులు, వ్యాపారంలో లాభాలు మొదలైన వాటిని మాత్రమె ఎక్కువగా కోరుతుండేవారు. అది నానావాలి గమనిస్తూ ఉండేవాడు. ఒకనాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొందరు వచ్చి బాబాను ధనం కోసం అనేక ప్రశ్నలు విసిగిస్తూ ఉండడం గమనించిన నానావాలి వేగంగా మసీదులోకి దూసుకు వచ్చి బాబా ఎదురుగా కూర్చొని, ఓ ఫకీరు డబ్బులు కాయలుగాకాసే ఒక పెద్ద చెట్టు నాకు వెంటనే కావాలి. ఆ చెట్టు మొక్కగా ఉండి ఎప్పుడో కాయలు కాస్తేకాదు. మొలకెత్తిన నాటి నుంచే కాయలు కాయాలి. ఎన్ని డబ్బులను చెట్టు నుంచి కోసుకున్నా తరగకుండా యిస్తూనే ఉండాలి. అలాంటి చెట్టును నీవు నాకు ఇప్పుడే ఈ తక్షణమే ఇవ్వాలి అంటాడు. అతని ఉద్రేకాన్ని చల్లబరుస్తూ సరేనని బాబా అభయం ఇవ్వగానే పకపక నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
అప్పుడు అక్కడి భక్తులు ఈతని పిచ్చిని బాబా సమర్ధించడం బాగాలేదని ఈ విషయం గురించి బాబా ఆలోచించాలని అంటారు. అప్పుడు బాబా వారితో ఇలా అంటాడు. ఆలోచించవలసినది నేను కాదు మీరు. నేను ఈ మసీదులో మీ కోరకు జ్ఞానమార్గాన్ని చూపించి ముక్తికి అర్హులౌనట్లు చేయుటకు కూర్చొని ఉండగా మీరు మాత్రం అల్పమైన విషయాలనే మరియు విషయవంచాలతోనే వస్తున్నారు. ఇప్పటికైనా మీమీ మనోభావాలను మార్చుకోండి. ఈ జీవితంలో మనిషి సాధించవలసినది ఏమిటి? ధనమే ముఖ్యమా? కాదె! కాని దానం కూడ జీవితానికి అవసరమే? అలాంటి జీవితానికి సరిపడు ధనాన్ని ధర్మమార్గంలో తగినంతగా సంపాదించుకోవచ్చును. అందులో తప్పులేదు. అత్యాసతో ధనసంపాదనకే జీవితాన్నంత వ్రుధాచేసి మితిమీరిన ధనాన్ని సంపాదించినా అది ఆఖరికి మరణించినప్పుడు మనిషి వెంటరాదు కదా.   
నా ఆధ్యాత్మిక కోశాగారము పూర్తిగా నిండి పొంగి పొర్లుతుంది. ఎవరికీ ఏమి కావలనన్న ఇవ్వగలను. వారంతట వారు కూడ వచ్చి ఎవరికి కావలసినంత వారు తీసుకొనవచ్చును. కాని అందుకు తగినంత అర్హతను ముందుగా పొందవలెను. నేనిచ్చునది పుచ్చుకొనుటకు ఎవరు ఇష్టపడరు. వారు కోరినదే వారికి కావలెను.నేను విలువైన బంగారము ఇచ్చుటకు సిద్దముగా యుంటిని. కాని వారు పనికిరాని మట్టిగడ్డలనే కోరుతున్నారు.
మనము ఎక్కడి నుండి ఈ మానుష శరీరంలోకి వచ్చితిమి. ఇక్కడ ఉండి ఏమి చేయుచుంటిమి, చివరకు శరీరంలో నుండి ఎక్కడికి వేల్లుచుంటిమి? చావు పుట్టుకల ఈ చదరంగాన్ని నడిపించేదేవారు? కనిపించు సూర్యచంద్రాదులు, నక్షత్రములు, గ్రహరాసులను సృష్టించినవారెవరు? వీటిని గురించి మానవులు ఆలోచించే స్థితిలో లేరు. కేవలం ధనము, శారీరక సుఖము సంసార విషయలోలురై ఈ శరీరమే శాస్వితమనే భ్రమలోపడి దీపమును ఆకర్షించబడి ఆ వేలుగులోపడి కాలిపోయే పురుగులవలె మానవులు నశింపువైపే మొగ్గుచూపెదరు. ఇది పూర్తిగా అజ్ఞానము. జ్ఞానమార్గము దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. మానవజాతిని జ్ఞానమార్గానికి మరలించటానికే ఈ నా శరీరం ఏర్పడినది, అని బాబా వారికి సుదీర్ఘమైన సందేశము నిచ్చెను.       
అనేకసార్లు బాబా తన బోధనలద్వార నేను అనే పదమును వివరణను ఇస్తూ ఉండేవారు. నన్ను తెలుసుకొనుటకు నీవు ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం లేదు. నీ శరీరానికి గల నామమును రూపమును తొలగించినచో నీలో మిగులునది నేనే. నీలోనేగాక సకల ప్రాణికోటి యందు సమానముగానే యున్నాను. దీనిని మీరు గుర్తించినచో సకల ప్రాణులలోను నన్నేమీరు చూడగలరు. మీరు ఏ ప్రాణిని హింసించిన నన్ను బాధపెట్టినట్లే. ఇతరుల వలన మీకు కలుగు కష్టనష్టములను సహించి ఓర్చుకోనువారే నాకు మిక్కిలి ప్రేమ పాత్రులని బాబా చెపుతూ ఉండేవారు.

సాయిబాబా ఉపదేశములు:
(మన దైనందిన జీవితంలో ప్రవర్తించవలసిన తీరును గురించి బాబా తరచుగా ఇలా చెపుతూ ఉండేవాడు.)
గతజన్మ సంబంధమువలననే ఇప్పుడు మనము ఒకరి నొకరు కలుసుకోనుచున్నాము. ఏమనిషైనా, ఏ జంతువైనా నీ దగ్గరకు వచ్చినపుడు నిర్ధాక్షిన్యముగా తరిమి కొట్టవద్దు. చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలెను. దాహముతో నున్న వారికి నీరు, ఆకలితో ఉన్న వారికి అన్నము, దిగంబరులకు బట్టలు ఇవ్వవలెను. నీ వసారా ఇతరులు కూర్చొని విశ్రాంతి తీసుకొనుటకు ఉపయోగపడినచో భగవంతుడు నీపట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించును. ఎవరైనా ధనము కొరకు నీ దగ్గరకు వచ్చిన నీ కిష్టము లేకున్నవారికి ఈయనక్కర్లేదు. కాని కఠినముగా మాట్లాడి వారి మనసు నొప్పించవద్దు. ఈ ప్రపంచము నడక ఒక నాటకరంగము వంటిది. నీ ముందు జరుగు చిత్రవిచిత్రమైన ఈ నాటకమును శ్రద్ధతో చూచుచుండుము. ఈ ప్రపంచము తలక్రిందులైనా నీవు చలించకుము. స్థిరముగా నుండుము. నీకు నాకు భేదము లేదు. మనిద్దరము ఒక్కటే. నీకు నాకు మధ్యగల గోడను తొలగించుము. మనందరికీ భగవంతుడే యజమాని. అల్లామాలిక్ హై! భగవంతుడు తప్ప ఇతరులెవ్వరు మనలను కాపాడలేరు. భగవంతుని మార్గము అసాధారణమైనది, చాల విలువైనది. మనము ఉహించలేనిది. మన మందరము ఋణాను బంధముచే ఇక్కడ కలిసితిమి. పరస్పర ప్రేమతో కుల, మత, జాతి భేదాలు మాని మానవులందరు సుఖశాంతులతో వర్ధిల్లాలి. పరోపకారమునకు భగవంతుడిచ్చిన ఈ శరీరమును ఉపయోగించవలెను. అట్టి వారి జీవితమే ధన్యము మిగిలిన వారంతా పేరునకే బ్రతికెదరు.

ఏదైనను మనసుతో భగవంతునికి సమర్పించడం వలన కలిగే లాభమే జ్ఞాన సముపార్జనకు మొదటిమెట్టు (సాయిబాబా) :     

పంచేద్రియముల కంటే ముందుగానే మనసు, బుద్ధి విషయములపై వాలి వాటి వాసనలను అనుభవించును. విషయ వాసనలను వదిలి పంచేద్రియములు ఉండలేవు. అందవలన విషయములకు ఇంద్రియములకు మధ్య భగవంతునిని ఒక అడ్డుగా పెట్టినచో మనస్సు యొక్క పరుగు వేగముతగ్గెను. ఏదైనను ముందు భగవంతునికి సమర్పించినచో దాని యందు వ్యామోహము తగ్గును. ఇట్టి భౌతిక విషయములలోనే కాక కామ, క్రోధ, లోభమోహాదులను కూడ గురువున కర్పించిన క్రమముగా చిత్తవ్రుత్తులన్ని నశించును. దీనివలన విషయ విచక్షణా జ్ఞానము కలిగి చక్కని గుణశీలమును వ్రుద్దియగును. సద్గుణముల వలన దేముని యందు నిశ్చల ప్రేమ పెరుగును. దైవానుగ్రహము వలన నేను దేహినికాను అను సత్యము దర్శనమౌను. అప్పుడు మాత్రమె బుద్ధి శుద్దచైతన్యములో లీనమగును. ఇదే ఏకాత్మ భావన. మొదట నేను వేరు విషయ వస్తువు వేరు అనుభవము ఉండును. అందువల్లనే వేరుగా కనిపించే విషయవస్తువు కొరకు మనసు పరుగులు పెడుతుంది. నేను, బయటగల విషయవస్తువు ఒక్కటే అనే ఏకాత్మభావన కలిగినప్పుడు తనకు వేరైనది బయట లేదు అని తెలుసుకోగలిగినప్పుడు, తన రూపమే బయట అనేక విధములుగా ఉన్నదనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు మనస్సు దేనికొరకు, ఎటూ పరుగులు తీయవలసిన అవసరం ఉండదు. ఉన్నతమైన ఈ స్థితి మనిషి చేరుటకు మొదట సర్వం భగవదార్పనమే తోలి సాధన కార్యక్రమముతో ప్రారంభించాలి. మీ ఆలోచనలకూ, ఆశయాలకు, జీవిత గమనానికి నన్నే లక్ష్యంగా చేసుకున్న మీరు పంచేంద్రియముల ద్వార పొందే ప్రతి అనుభవాన్ని నాకు సమర్పించాలి. లేనిచో మీరు ఇంద్రియములను జయించలేక కోరికలకు బానిసలై తప్పు దారినపడు ప్రమాదం వచ్చును.

కపిల వాసుదేవుడు తన తల్లి అయిన దేవహుతికి బ్రహ్మ విద్యను (ఆత్మ జ్ఞానాన్ని) బోధించుట:

శ్రీ మహా విష్ణు మూర్తి సత్య యుగం ప్రారంభమైన తరువాత ఆయన బ్రహ్మ విద్యను ఈ లోకంలోని మానవాళికి తెలుపడానికి తానే కపిలుడుగా ఈ భూమి మీదకు అవతరించాడు. ఆ విధంగా మానవాళికి బ్రహ్మవిద్యను అందించడం కోసం ఆయన కర్ధముడు మరియు దేవహుతి కి కుమారుడుగా జన్మించాడు.
ఆయన పుట్టిన తరువాత కర్దముడు తపస్సు కోసం దేవహుతి ని వదలిపెట్టి అడవులకు వెళతాడు. ఆ తరువాత కపిలుడు పెద్ద వాడైన తరువాత తన తల్లి ద్వార బ్రహ్మవిద్యను ఈ లోకంలోని మానవాళి కోసం వివరించాడు.

తల్లీ! బంధమునకు, మోక్షమునకు మనస్సే కారణము. మనసు త్రిగుణములతో చేరి, ఆ గుణములు సమత్వము తప్పినప్పుడు, అందులో యేదో యొక గుణము తీవ్రమై దానివలన జనించు ఉద్రేకముల యందు ఆత్మ తగుల్కొని యుండును. మనస్సు అంతరాత్మ నుండి దూరమై, ఇంద్రియములకు సంతృప్తి గూర్చు వస్తువులయందు తగులువడి యుండును. ఇంద్రియములకు వస్తు అనుభవమును సమకూర్చుచు, ఆత్మకు దూర దూరముగ జరిగి మనస్సు సంచరించుచుండును. అదే మనస్సును అంతర్ముఖము గావించి, పురుషోత్తముడైన నారాయణునితో అనగా ఈశ్వరునితో చేర్చియున్నప్పుడు, ఇంద్రియ లంపటముల నుండి స్వేచ్ఛను పొందును ఈ మార్గమునకు చిఇత సంయమనమని పేరు గంయమునకు ఇది మొదటి మెట్టు.నేను-నాది అను భావములు అద్రుశ్యమైనపుడు, మనస్సు కామక్రోధములనే దుష్టశక్తుల నుండి స్వేఛ్చ నొంది యుండును. అప్పుడు మనస్సు శుద్దముగా నుండి నన్ను ధ్యానించి చేరుట కర్హమై యుండును. అపుడు ప్రాపంచిక సుఖ దుఃఖములు మనసును అంటవు. భక్తి, జ్ఞాన వైరాగ్యములతో నిండిన మనసు బ్రహ్మమును దర్శించగలదు.



భక్తి మార్గము :
తల్లీ! అన్ని మార్గములలో భక్తి మార్గము అతి సులభమైనది .తప్పక గంయమునకు తీసుకు వెళ్ళగలదు. ఇతర మార్గములు, భక్తి మార్గము తీసుకువెళ్ళునంత త్వరగా, మోక్షమునకు తెసుకెళ్ళలేవు మానవునిలో సంగమనే గుణము అంతర్లీనముగా ఉన్నదనీ ఋషులు చెప్పుదురు. దీనికి నాశము లేదు నిత్యమూ పచ్చగా ఉండి, నాశనము లేని ఈ గుణమును విస్మరించుటకు వీలులేదు. అమ్మా! సంగమనునది యెల్లప్పుడు ఉండును. మోక్షమునకు దీనినొక సాధనముగా వినియోగించు కొనవలెను. సంగము అనగా అనుబంధము ఉండనిమ్ము. కాని బాహ్య వస్తువుల నుండి మరల్చుము ఇంతవరకు నీకు ప్రాపంచిక వస్తువులపై అనుబంధము కలదు. ప్రాపంచిక వస్తువులకు బదులుగా నారాయణునితో అనుబంధము యేర్పరచుకొనుము. అనుబంధము వీడనక్కర్లేదు. నారాయణునితో అనుబంధము బాహ్య వస్తువులతో గల అనుబంధమును త్రెంచును. ఇది సులభముగా చేయవచ్చును.
ఈ అనుబంధము అధముమైన వానినుండి ఉత్తమమైన వానివైపు మల్లించుట క్రమ క్రమముగా జరుగవలెను. ఒక్కసారిగా ఒకదానిని వదలిపెట్టి రెండవదానిని చేబట్టుట సాధ్యము కాదు. అందుకు మనస్సు సహకరించదు. అంతిమ ద్యేయమునకు ముక్త సంగమాని పేరు. ఈ మార్గము ననుసరించుట సాధు సాంగత్యముచే, మనసునకు తగిన శిక్షణ కలుగును సజ్జన సాంగత్యము కలిగిన తర్వాత, మనస్సు వెనుకటి ఆకర్షణలకు లోబడకయుండును. ఇందువలన తరువాత మెట్టు సులభమగును.
భగవంతునిపై ఆలోచనలకూ మనస్సును మళ్ళించుటెట్లు? అనుకున్న దానికన్న తెలికయే. ఇంతకు ముందు అరిషడ్వర్గములైన కామక్రోధములు , నేను-నాది, అను భవములు మనస్సును మాలిన మొనర్చి గమ్యము నుండి మరల్చి, ఇంద్రియములకు తృప్తిని గూర్చు వస్తువులవైపు నడిపించునని తెలిసియున్నాను. అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములచే కల్మషముల బారినుండి స్వేఛ్చ పొందిన మనస్సు సహజముగా భగవంతునివైపు మరలును.
దీనిని సాధించి, ముక్త సంగులైన తర్వాత, సత్సంగము అనగా సజ్జనుల సాంగత్యముతో కాలము గడపవలెను. నిత్యము పచ్చగా ఉండే అనుబంధము సాధువులతో ముడిపడి యుండవలెను. సాధువు లెవరు? వారి లక్షణము లేమిటి ?వారిని గుర్తించుటెట్లు? ఇవి నీకు చెప్పెదను. ఈ భౌతిక శరీరమునకు కలిగే బాధల వలన అనారోగ్యముల వలన సాధువులు తమ మనస్థితిని పోగొట్టుకొనరు. అందరి మానవుల యెడ వారు దయకలిగి యుందురు. అన్ని జావులు వారికి బంధువులే. అన్నీ జీవులను ప్రేమించెదరు అందుచే సహజముగా వారికి శత్రువులుండరు. వారు యెప్పుడు శాంతముగా మరియు వారి మనస్సు యెట్టి కలవరములు లేక ప్రశాంతతో నిండి యుండును. వారు యెప్పుడును ధర్మ మార్గమును విడిచిపెట్టరు. వారి ప్రవర్తన దోషరహితము నన్ను గురించియే వారెప్పుడు తలంచెదరు. వారికి యెటువంటి విధులు, బాధ్యతలు, సంబంధము లేకుండుట చేత, నా గురించి కథలు తెలుసుకొనుట లోను వాటిని ఇతరులకు తెలియజెప్పుట లోను ఆనంద మనుభవించుచుందురు. ఈ ప్రాపంచికమైన బాధలు వారిని బాధించవు. వీటినుండి స్వేచ్ఛను పొందినటువంటి వారినే సాధువులందురు. అమ్మా! ఇట్టి సాధువులతో నీ మనస్సు అనుబంధము కలిగి యుండవలెనని ప్రార్ధింపుము. వారు నీకున్న అనుబంధముల నుండి విముక్తి కలిగించుటకు సహాయపడగలరు.
కపిలుడు చెప్పుచుండగా తల్లి శ్రద్దగా వినుచూ మధ్యలో ఇట్లా అడిగెను.నేను వేదములు చదవలేదు మరి నావంటి అమాయిక స్త్రీ భగవంతుని చేరుటెట్లో తెలియజెప్పుము. భగవంతుని చేరుటకు సులభమైన మార్గమేది?
భక్తీ యని కపిలుడనెను. నీకు భక్తి యోగము ఉపయోగపడును. ప్రాపంచిక వస్తువులందు తగుల్గోనిన ఇంద్రియములు, వేదములు నిర్దేశించిన నిత్యవిదులు, కర్మలు చేయుట యందు నిమగ్నమైన మనస్సు, ఈ రెండు కూడను విముక్తి పొందుటకు ఒకే ఒక మార్గము కలదు. అది తనకు తానుగా శ్రద్ధతో మోక్షమును కాంక్షించుట నారాయణుని యందు అనన్య భక్తి పెంపొందించుకొనినపుడు ఈ కాంక్ష తీరగలదు. ఈ భక్తి కర్మ బంధములను, ఇంద్రియ బంధములను, శరీరములోని అగ్ని (వైశ్వాసరుడు) భుజించిన ఆహారమును దహించినట్లుగా దగ్దము చేయును. భక్తి వస్తు ప్రపంచము నుండి విముక్తిని కల్గించి, నారాయణునితో ఐక్యమగునట్లు చేయును భక్తి మార్గములో పయనించు భక్తులు ముక్తి అనే గమ్యమును సునాయాసముగా చేరగలరు.
నాకు యెప్పుడు సేవచేయుచు, నాతోనే అనుబంధము కలిగియుంటూ, నాకు సంతోషము కలిగించుటకే కర్మలను చేయుచూ, నా కథలనే యెల్లప్పుడు చెప్పుచుండు సాధువులు మోక్షమును సైతం కోరరు నన్ను గురించిన ఆలోచనలతోనే వారు ఆనందముగా నుండెదరు వారు తమ మనో నేత్రముతో నా రూపము నెప్పుడు చూచుచుందురు అందుచే, వారడిగినను లేకున్నను, నేను వారికి ముక్తిని ప్రసాదింతును.
నా భక్తులకు యెట్టి వినాశము కలుగదు నాలో లీనము కానున్న భక్తుల యెడ చక్రము (కాలచక్రము), శక్తిహీనమై యుండును. నేను భక్తులకు సర్వస్వమును పుత్రులపై యెట్టి ప్రేమయో ణ భక్తులపై నాకట్టి ప్రేమ నేను భక్తులకు మిత్రుడను, గురువును, శ్రేయోభిలాషిని, ప్రియతముడను ఈ లోకమంతయు నా ఆధీనములో నుండుటచే నా భక్తులకు యెట్టి భయము ఉండదు. నాకు భయపడి గాలి వీచును, సూర్యుడు ప్రకాశించును, పర్జన్యుడు (వరణుడు) వర్షించును నాచే నియమితుడై అగ్ని దహించును, యనుడు అందరిని కనిపెట్టి యుండును. ఇంద్రియములను జయించిన యోగులకు భయము కలుగదు వారు నన్ను తప్పక చేరెదరు. ఇందు యే మాత్రము సంశయము లేదు.
సాంఖ్య యోగము :
పురుషుని రహస్యమును, అతడు యీ లోకమునంతయు యెట్లు వ్యాపించియున్నది నీకు నేను చెప్పెదను. దీనిని ఆత్మవిధ్యా యోగమందురు. సంపూర్ణముగా దీనిని చక్కగా అర్ధము చేసికొనిన యెడల, నీవు మోక్షమును పొందగలవు. ఈ యోగము తెలుసుకొనిన వారి సంషయములన్ని నివృత్తి కాగలవు. నీలో వున్న ఆత్మయే పురుషుడు. అతనికి ఆద్యంతములు లేవు. అతడు స్వయం ప్రకాశకుడు. పురుషుడు కాని వస్తువేదియు లేదు. పురుషునికి భిన్నమైనదేదియు లేదు. అతడు అంతటా వ్యాపించియున్నాడు. అతడు నిత్యుడు.
ప్రక్రుతి కారణముగా ఆత్మ ఉపాధులతో చేరియున్నది. పురుషుడు నిత్యుడని ఇంతకు ముందు తెలిపియున్నాను. ఈ బహుళ ప్రపంచము నందంతటా వ్యాపించి యున్నది ఆ పురుషుడే. అతడు త్రిగుణాతీతుడు పురుషునికి సంబంధించిన ఈ రెండు విషయములను సమన్వయ పరచుటెట్లు? ఒకటి శుద్దమైనది. రెండవది బహుళ ప్రపంచము. పురుషుడు గుణములకు, ప్రకృతికి అతీతుడెట్లు కాగలిగెను? ఈ లోకములోని జన మరణములతో అతని ప్రమేయము యెట్లు కలిగెను? జ్ఞానులకు ఇది చిత్రవిచిత్రమని గోచరించదు.
ప్రక్రుతి యందు రెండు కీలక శక్తులు కలవు. ఒకటి ఆవరణ శక్తి, రెండవది విక్షేప శక్తి. త్రిగుణములు నను విభక్తముగా నున్నప్పుడు దానిని నిర్గుణ స్థితి యందురు, అనగా గుణములు లేనట్టి స్థితి. పురుషుని మరొక రూపమే కాలము. కాలము తిరుగుచున్నప్పుడు, త్రిగుణములలో సమత్వము తప్పిపోవును. ఈ సమత్వము లేక సమవిభక్త స్థితి తప్పినపుడు, రజోగుణము ప్రకటితమగును. దాని తర్వాత మిగిలిన రెండును ప్రకటితము కాగలవు.
ఆ విధముగా గుణములు కార్యమునకు దిగినపుడు, ఆవరణ విక్షేపములు కలుగును. ఇప్పుడు పురుషుడు రెండు రూపములు ధరించును. ఒకటి జీవుని రూపముం, రెండవది ఈశ్వర రూపము. గుణములతో కూడిన పురుషుని జీవుడందురు. ఆవరణము, జీవుడు తన సహజ (నిజ) స్వభావమును మరచిపోవునట్లు చేయును అవిద్య చేత ఈ మరపు కలుగుచున్నది. అవిధ్యతో పాటు విక్షేపనము కలుగును. విక్షేపనము కలవరము లేక ఆందోళనను సృష్టించును. దీనినే మాయ అందురు. ఇది అసత్యము సత్యమను భ్రమను కలిగించును అనగా అవిధ్యకు, మాయగా ఆవరణ విక్షేపములే కారణము. ఆవరణ విక్షేపముల చేత జీవాత్మ తన నిజ స్వరూపమును విష్మరించుచున్నాడు. అశాశ్వతమైన ఉపాదులే తానని భ్రమించి ఈ బహుళ ప్రపంచపు ప్రలోభములకు లోనై చిక్కుకొని పోతున్నాడు. ప్రక్రుతి యొక్క ఆవరణ విక్షేప శక్తులను భ్రమింపక, వేరుగా నుండునదే పురుషుని రెండవ స్వరూపమైన ఈశ్వరుడు.
ఈ మాయ నుండి విముక్తి పొంది, అనగా జీవుడు ప్రక్రుతి శక్తులు బంధించలేని స్థితికి చేరుటకు ఒక మార్గము కలదు అదియే భక్తీ యోగము. అమ్మా! ఎల్లప్పుడూ భగవంతున్నే చింతింపుము భక్తీ దానంతటదియే జ్ఞాన వైరాగ్యములను కలిగించును. వాటిని నీవు అన్వేషించ నవసరము లేదు. నారాయణునిపై ప్రేమ పెంపొందినప్పుడు, ఇతర వస్తువులపై ప్రేమ లేకుండ జేయును. ఆ విధముగా వైరాగ్యమలవడును. భక్తి నారాయణుని పాదములు చేరు మార్గమున తీసుకపోవును. నారాయణుని సన్నిధికి చేరుటయే జీవిత లక్ష్యముగా యెంచిన భక్తుడు సత్యమును తెలుసుకొన్న వాడగును. అనగా అతని అవిద్య తొలగినదన్నమాట. నారాయణుడే సత్యమని, యితరమైనవి అసత్యమని తెలుసుకోనును అదియే జ్ఞానము.
వివిధ యోగములు బ్రహ్మమును, పురుషుని, ఈశ్వరుని, భగవంతుని చేరుటకు మార్గమును సూచించు చున్నవి. అనగా గమ్యము ఒకటే. పురుషుడు అనగా ఈశ్వరుడు ఈ బహుళ ప్రపంచమందు అన్నింటియందు వ్యక్తమగుచున్నాడు. దీనిని గ్రహించిన వాడు బ్రహ్మమే యగును. అనగా బ్రహ్మత్వమును గురించి తెలుసుకొనుట కాదు, బ్రహ్మత్వమునే పొందుట. తానె బ్రహ్మమని యెరుక కలిగియుండుట. జీవుడు, తానూ పురుషుడు లేక ఈశ్వరుడనని యెరుగును.

ఇప్పుడు నీకు బోధించిన జ్ఞాన యోగము, ఇంతకు ముందు బోధించిన భక్తి యోగము ఈ రెండును నిజముగా ఒక్కటే. ఒకటి, మరియొక దానికన్నా వేరుకాదు.
అమ్మా! వివిధ మార్గములను నీకు బోధించితిని. ఏ ఒక్క మార్గమునైనను శ్రద్దగా అనుసరించినపుడు నీకు తప్పక మోక్షము లభించగలదని హామీ యిచ్చుచున్నాను.

వ్యాసమహర్షి కుమారుడు శుక మహర్షి పరీక్షిత్తునకు ధారణ గురించి తెలియచెప్పుట:

మృత్యువు సమీపించుచున్నప్పుడు మృత్యు భయమును వీడవలెను. త్యాగమను కత్తితో భార్య, పిల్లలు, ఆస్థిపాస్తులతో నున్న బంధములను తెగనాడవలెను. ధ్యానమునకు కూర్చోనవలెను. ధ్యానము సలుపు ప్రక్రియను నేను వివరముగా తెలిపెదను.

ప్రాణాయామముతో మనస్సును నిశ్చలముగా ఉంచవలెను. ఓం అను యేకాక్షరమును పదే పదే ఉచ్చరించవలెను. మనస్సును నిగ్రహించిన తర్వాత, రథసారధి వలె బుద్ధి కళ్ళెము పట్టుకొని మనస్సును భగవంతుని మననము గావించు మార్గమున తీసుకువెళ్ళగలదు. మనస్సు ఇంద్రియములకు వశము కాకుండా చూడవలెను. భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించుటకు అష్టాంగాయోగమనే ప్రాధమిక యోగ ప్రక్రియ సహాయపడును. ఈ యోగము ఎనిమిది గుణములతో కూడుకొని యున్నది. ఈ గునములన్నీ నీలోని అంతర్భాగములు కావలెను. అవి యేవనగా, అహింస ఇతరులకు హాని కలిగింపకుండుట; సత్యము నిజాము పలకుట; అస్తేయము ఇతరులకు చెందిన వాటిని దొంగిలింపకుండుట; బ్రహ్మచర్యము ఇంద్రియములను నిగ్రహించుట; అపరిగ్రహము ఇతరుల నుండి వస్తువుల గ్రహింపకుండుట; శౌచము లోపల బయట నిర్మలముగా ఉండుట; తపస్సు సాధన చేయుట; స్వాధ్యాయము శాస్త్రములను చదివి వాటిని తెలుసుకొనుట ఈ ఎనిమిది గుణములను ధారణ అందురు. ఇది తరువాత చేయు ధ్యానమునకు నాంది.

హిందూ ధర్మము దాని ప్రాముక్యత :

హిందూ ధర్మం అనేది మతమనుకుంటాం. కాని నిజానికది ఓ భారతీయ ధర్మం. భరత ఖండమంతటికీ చెందిన ఓ సైద్ధాంతిక ధర్మం. దీనినే మానవధర్మమనీ అంటాం. ఆత్మవత్సర్వ భూతేషుఅని చెప్పగలిగే ధర్మం. సనాతనధర్మమే! సాటివారెవ్వరికీ ఏ బాధా - అవరోధమూ కలగకుండా మోక్షాన్ని దర్శింపచేసేది కేవలం హిందూ ధర్మమే. ఏ మతంకూడా ఏ ఇతర ధర్మాన్నీ అవహేళన చేయని, వ్యతిరేకించని ఛెప్పదు.
పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హిందూ ధర్మమే మూలాధారమైనది
మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులెనె్నన్నో సమృద్ధిగా ఉన్నాయి. పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము. ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ధర్మంఅని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు ఉపనిషత్తులు పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.
హిందుత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హిందూ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం అందించిన జీవన రచనా విధానం వల్లనే హిందూ సమాజం చిరంజీవిఅయింది.
బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది.మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం. ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హిందూ ధర్మచింతన ప్రసాదిస్తున్నది. ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి

గజేంద్ర మోక్షం - గజేంద్రుని మొర:

లక్షీదేవికి పుట్టిల్లయిన పాల సముద్రం మధ్య త్రికూటమనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతపు లోయలలో అతి సుందరమైన సరస్సులు, పుష్పవృక్షాలు ఉన్నాయి. 
హూహూ అనే గంధర్వుడిని దేవలముని శపించగా ఆ త్రికూట పర్వతపు లోయలలో ఉండే ఒక సరస్సులో మొసలిగా మారిపోయాడు.
పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే మంచి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అగస్త్యముని శాప కారణంగా ఇంద్రద్యుమ్నుడు త్రుకూట పర్వత సమీపంలో ఉండే అడవిలో తిరిగే ఏనుగు రాజయిపోయాడు. ఆ ఏనుగులరాజు దాహం తీర్చుకొందామని ఒక సరోవరం కనిపించగానే ఆనందంగా దాహం తీర్చుకుని , తన గుంపుతో జలక్రీడలాడుకోడం మొదలు పెట్టాడు.
ఆ సరోవరరంలోనే శాపవశాన్న మొసలిగా మారిన గంధర్వుడు ఉన్నాడు. ఆ మొసలి చట్టున వచ్చి , ఏనుగురాజు కాళ్ళు పట్టుకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ మొసలి నుంచి విడిపించుకుందామని గజేంద్రుడు యెంతో ప్రయత్నించాడు. కష్టమవుతుంటే మిగతా ఏనుగులుకూడా సాయం చేయవచ్చాయి. కాని లాభం లేకపోయీంది. హోరా హోరీగా ఆ రెండూ వేయేళ్లు పోరాడుకున్నాయి.
క్రమంగా ఏనుగు అలసిపోయి , మొసలిదే పైచేయి అవవచ్చింది. గజేంద్రుడికి మరి తన శక్తితో లాభం లేదని తెలిసిపోయింది. పూర్వజన్మ వాసన వలన దైవచింత వచ్చింది. అందరినీ రక్షించే ఆ దేవుడే నన్ను కాపాడాలి అని ఆలోచించి , " నేనింక పోరాడలేను అని దేవుని ఈ విధంగా ప్రార్ధించడం మొదలు పెట్టాడు గజరాజు .

కనబడుతున్న జగత్తంతా ఎవరినుండి వస్తున్నది? ఎవరియందు నిలబడుతున్నది? తిరిగి ఎవరియందు లీనమవుతున్నది? సృష్టికి ములకారణ మెవ్వరు? ఆది మధ్యాన్తరహితుడైన వాడెవ్వడు? అలాంటి ప్రభువునకు ప్రణమిల్లుతున్నాను.
ఒకపరి లోకాలను వెలువరిస్తూ, ఒకపారి ఆ లోకాలను లోపలికి తీసికొంటూ, రెండూ తానే అయి రెండింటికి సాక్షిగా ఉంటూ ,అన్నింటికీ ములమై వెలుగుతున్న అతనికి నమస్కరిస్తున్నాను.
లోకాలున్నాయి, లోక పాలకులున్నారు, లోకస్తులున్నారు. ఇలా భిన్న భిన్నంగా గోచరిస్తున్నారు. ఈ భిన్నత్వమనే పెనుచీకటికావల ఏకాక్రుతితో వెలుగుతున్న ఆ వెలుగుల మూర్తికి నమస్కరిస్తున్నాను. 
అతడు నటన సూత్రధారి. ఈ నామరుపలన్ని అతని వివిధ భంగిమలే! అతడే ఇన్ని మూర్తులుగా గోచరిస్తూ జగన్నాటకాన్ని ఆడుతున్నాడు. అతనిని కీర్తించడానికి, అతని వర్తనాన్ని గ్రహించడానికి ఎవరికీ సాధ్యమవుతుంది? అలాంటి దేవదేవునికి నమస్కరిస్తున్నాను.
ముక్తసంగులైన మునులు, సర్వభూతహితులైన ప్రేమ స్వరూపులు, సాధువర్తనులు. వీరందరూ కూడా ఎవరి పాదాలను ఆశ్రయిస్తున్నారో, ఆ పాదాలే నాకు కూడ దిక్కని నేను నమ్ముకొంటున్నాను. 
దైవాన్ని ఇలా పొడగట్టించుకొనే ప్రయత్నం గజేంద్రుని నుండి జరుగుతూ ఉండగా, మొసలి అతడిని మరింతగా వేధించసాగింది. ఆ వేధింపకు అతడు కలత చెందినవాడై.
తప్పు, తప్పు ఇలా అనరాదు. కలలోనైనా ఇలా అనుకోకూడదు. ఎన్ని సార్లు ఎందరిని ఎన్ని విధాలుగా రక్షించలేదు అతడు. ప్రార్ధించడం చేతకావాలేకాని, అతడు పలక్కపోవడం ఉంటుందా.!
కలిమి లేములతో నిమిత్తం లేకుండా కలసివచ్చే వాడతను. ఆ మాత్రం నన్ను కనికరించాడా! దుష్టులపాల పడుతున్నప్పుడల్లా శిష్టులను ఆడుకొనే వాడతను. ఆ మాత్రం నన్ను ఆదుకోడా! చూడగలిగిన కన్నుతో, తనను చూడగలిగిన వారందరిని తానుగా చూచుకొనేవాడు. ఆ మాత్రం నన్ను చూచుకోడా? తనకోసం మొరలిడే వారి మొరను తానుగా వినివచ్చి, చేయూత నందించేవాడే ఈ నా మొర వినడా!
ఇన్ని రూపులు తన రూపమైనవాడు, ఆది మధ్యాంతాలు లేనివాడు. ఆత్మ బంధువు. ఆపద్భాందవుడయినవాడు. ఈ నా స్థితిని వినడా, చుడడా, తలపడా, నా కొరకు వెంటనే తరలిరాడా! తప్పక వస్తాడు.
తండ్రీ! ఇంతవరకు నేనుచేస్తూ వచ్చినదాన్ని నేను గమనించుకొన్నాను. నా ప్రయత్నాన్ని నా ప్రయత్నంగా కొనసాగిస్తూ ,నీ అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నాను. అందువల్లనే నెమో బహుశ నా పిలుపు నిన్ను చేరలేకపోతుంది.
తెలిసికొన్నాను. నా ప్రయత్నమనేది వేరే లేదనీ, అదికూడా నీ అనుగ్రహంలో భాగమేనని తెలుసుకొన్నాను. నీ అనుగ్రహాన్ని పట్టుకొని, కొంతనాడిగా కొంత నీదిగా భ్రమపడుతున్నాననీ కూడ అర్ధం చేసికొన్నాను. ఈ నా దృష్టిని సరిజేసి కొంటున్నాను. తండ్రీ! నన్ను కరుణించు! మా ప్రయత్నమనీ, దైవానుగ్రహమనీ. ఉన్నదీ, రెండుగా కనబ్డుతున్నదీ ఒక్కటే! అదే నీ అనుగ్రహం.
ఇక నా పరిస్థితి గమనించు. 
జీవుల మాటలన్నీ వినిపించుకొంటావట నీవు. మా హృదయ ఘోషలన్నీ గమనించు కొంటావట? ఆర్తులను రక్షించడం కోసం ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడికైనా వచ్చేస్తావట? జీవులుకో అని పిలిస్తే నీవు అని పలుకుతావట. తండ్రీ , రావా, నన్ను చేరరావా! నన్నాదుకోవా ! నన్ను నీ అక్కున జేర్చుకోవా!
ఆ గజేంద్రుని మొరవిన్న శ్రీమహావిష్ణు మూర్తి ప్రక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖు చక్రాలను చేపట్టలేదు. పరివారాన్ని పిలిపించలేదు. గరుత్మంతుడు వచ్చేవరకైన ఆగలేదు. తలకట్టునైనా సరిజేసుకోలేదు. ఆటలాడే వేళలో తన చేతిలోనికి వచ్చిన పైటను ఆమెకు వదిలివేయాలని కూడా అతనికి తోచలేదు.
ఆ విష్ణువు దృష్టిలో గజేంద్రుడు మాత్రమె ఉన్నాడు. గజేంద్రుని మొరమాత్రమె అతనికిప్పుడు వినబడుతోంది. గజేంద్రుని వైపు వేగంగా సాగి వచ్చేస్తున్నాడు.
ఆ విధంగా బయలుదేరిన ఆయనను అనుసరిస్తూ లక్ష్మితో సహా మొత్తం సపరివారం వైకుంతం నుండి వారు కూడా శ్రీహరిని అనుసరిస్తూ వచ్చేస్తున్నారు.ఇంతకూ గజేంద్రుడు పిలిచిందీ ఆ ఒక్కణ్ణి ! ఆ ఒక్కడు కదిలాడు. అంతే! ఇక అంతా కదిలారు. నారాయణుడు వెనుక ముందు చూడలేదు. గజేంద్రుడి వైపుగా వచ్చేస్తున్నడంతే! ఆయన వస్తున్నప్పుడు దేవతలంతా నమస్కరిస్తున్నారు, కాని ఆయనకు గజేంద్రుని మొర తప్ప ఆయనకు ఏమి వినబడటం లేదు. అతని దృష్టంతా గజేంద్రుని పన్నే ఉంది.  
క్షణాలలో సరస్సును సమీపించాడు నారాయణుడు. సమీపించడమే తడవుగా చక్రాయుధాన్ని మకరంపై ప్రయోగించాడు. ఆ మొసలికి తల తెగి పడింది.  
అందివచ్చిన ఆ అనుగ్రహానికి అమితంగా ఆనందిస్తున్నాడు గజేంద్రుడు ఆ ఆనందంలో నుండే విష్ణు స్మరణలో ఓలలాడుతున్నాడు. విజయసుచకంగా విష్ణుమూర్తి శంఖానాదం చేశాడు.