ఓం నమో
పరమాత్మయే నమః
సత్కర్మలే
(మంచి పనులే) చేయాలి......ఎందుకు?
కర్మ అంటే ఏమిటి?
సత్కర్మ అంటే ఏమిటి?. మొదట వీటి గురించి తెలియాలి. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను
కర్మలు అంటారు.అవి ఏవైన కావచ్చు. కాని చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు
అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. కర్మలలో ప్రావీణ్యత అంటే మనం జ్ఞానాన్ని కలిగి
వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అని అర్థం. జ్ఞానం అంటే ఆత్మానాత్మ
వివేకం. నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? దీని కర్త ఎవరు? ఇలా విచక్షణ
జ్ఞానాన్ని కలిగి వుండడమే జ్ఞానం అంటారు. ఇక్కడ మనకు కావలసింది సత్కర్మలే (మంచి
పనులే) ఎందుకు చేయాలి. అవును మంచి పనులే చేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రకృతికి కొన్ని
సహజ గుణాలు వున్నాయి అవి భగవంతుడు సృష్టితో పాటు ఇచ్చాడు. అవి ఏమిటంటే నువ్వు మంచి
పని చేస్తే నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా చెడు చేస్తే ఫలితం కూడ అదేలా
వుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ కర్మ ఫలితాలను
అనుభవించడమే కాకుండా నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడ వాటిని అనుభవించాల్సి
వస్తుంది. ఎందుకంటే నేను అంటూ నువ్వు అజ్ఞానంతో మరియు అహంకారంతో అన్ని పనులు
చేస్తూ వుంటావు కావున. నువ్వు ఈ శరీరం వదిలిన తరువాత కూడా వాటి ఫలితాలను
అనుభవిస్తావు. అయితే మంచి పనులు చేసి మంచి చేస్తున్నాను అని అనుకొని ఉంటే
స్వర్గానికి వెళ్లి ఆ కర్మ ఫలితాలను దేవతలకు సమానంగా అనుభవిస్తావు అవే చెడు అయితే
నరకానికి వెళ్లి అనుభవిస్తావు. ఇక్కడ కర్మ భూమిలో అయితే స్థూల శరీరం వుంటుంది. అదే
అక్కడ అయితే నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలే ఒక సూక్ష్మ శరీరంగా ఏర్పడి
ఆ సూక్ష్మ శరీరం వాటిని అనుభవిస్తుంది అంతే తప్ప వీటి అన్నిటితో ఆత్మకు ఎటువంటి
సంబంధం ఉండదు. అంటే నువ్వు చేసే రెండు కూడా నీకు (అంటే ఆత్మకు) బందనాలే అవి మంచి
అయితే బంగారు జైలు అదే చెడు అయితే ఇనుప జైలు అన్నమాట. రెండును నిన్ను (అంటే
ఆత్మను) బందీ చేసేవే. మరి ఈ రెండింటి నుండి తప్పించుకోవడం ఎలా ? ఎలా అంటే ఇక్కడ
యోగాన్ని అవలంబించాలి అప్పుడు మనం చేసే కర్మలను యోగం ద్వార చేయాలి దానినే కర్మ
యోగం అంటారు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో కర్మయోగం గురించి చాల విపులంగా
తెలియజేసాడు అంటే మనం ఇక్కడ కర్మయోగాన్ని అవలంబించాలి. అది ఎలా అంటే చేసే ప్రతి
పనిని భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్షరహితంగా, కర్మలను ఆచరిస్తూ వుంటే నిదానంగా నీ
మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి అయిన అంతఃకరణ భగవంతునిని
అన్వేషిస్తుంది అప్పుడు నీలో సత్వ గుణం అధికమవుతుంది. అంతే కాకుండా చేసే కర్మలు
నిష్కల్మషంగా కూడ వుండాలి అంటే చేసే పనులలో ఏ కల్మషం లేకుండా చేస్తే నువ్వు
అప్పుడు కర్మలలో ప్రావీణ్యత సాధించినట్లు. మరి మంచి పనులే ఎందుకు చేయాలి ? అంటే
మంచి పనులు చేస్తూ వుంటే నీకు తెలియకుండానే నీ అంతఃకరణ (నీ మనస్సు)
పరిశుద్దమవుతుంది. అప్పడు నీకు భగవంతుని తత్వం బోధపడుతుంది (అర్థం అవుతుంది)
లేకపోతె నీకు భగవంతుని తత్వం తెలియదు అప్పుడు నువ్వు ఇట్లే ఈ జనన మరణ చట్రంలో
తిరుగుతూనే వుంటావు.ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే నీకు పతనం తప్పదు. అది ప్రకృతి సహజ
గుణం. అందువలన ఈ రోజు నుండే నీవు మంచి పనులు మాత్రమే చేయాలి అని భీష్మించుకొని నీ
మనస్సును స్థిరపరచు. అయితే నువ్వు చేసే పని ఎలా వుండాలి అంటే కుడి చేత్తో చేసే పని
నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే విధంగా వుండాలి. అప్పుడు మానవుడు మాధవుడు
అవుతాడు.
No comments:
Post a Comment